20-06-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): నగరంలోని చర్లపల్లి చెరువును స్వచ్ఛమైన మంచినీటి సరస్సుగా తీర్చిదిద్ది, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు హైడ్రా, జైళ్లు శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం చర్లపల్లి చెరువును సందర్శించి, అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చలు జరిపారు.
58 ఎకరాల్లో చర్లపల్లి చెరువును ఆధునికీకరించడంతో పాటు సుందరీకరణపై దృష్టి సారించారు. అందులో భాగంగా జైళ్లు శాఖ, హైడ్రాతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, జీహెఎంసీ అధికారులు ఇన్లెట్, ఔట్ లెట్లను పరిశీలించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు కట్టను బలోపేతం చేసి పాత్వేను అభివృద్ధి చేయలాని అధికారులు నిర్ణయించారు. సోలార్ లైటింగ్ సిస్టమ్తో పాటు సీసీటీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
చెరువులో మంచి నీరు నిలిచేందుకు డీపీఆర్ను రూపొందించాలని హైడ్రా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగానికి కమిషనర్ రంగనాథ్ సూచించారు. కాగా ఈ చెరువుకు మురుగు నీరు కలవకుండా డైవర్షన్ నాలా కూడా అందుబాటులో ఉంది. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల మేర నడక దారి అందుబాటులోకి రానుంది. చర్లపల్లి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులుసీఎస్ఆర్ కింద నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని సౌమ్య మిశ్రా వెల్లడించారు.
అంతకు ముందు చెరువుకు సంబంధించిన వీడియో చిత్రాలను, చెరువు అభివృద్ధికి చెందిన ప్రణాళికలను జైళ్ల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, జైళ్ల శాఖ ఐజీ మురళీ బాబు, డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్, ఓపెన్ జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.