జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి(Jyotiba Phule Jayanti) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. సమానత్వం, న్యాయం, విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని కొనియాడారు. మహిళలు, అణగారినవర్గాల హక్కుల పరిరక్షణలో పూలే మార్గదర్శి అన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అన్నారు. ఢిల్లీలో జ్యోతిరావుఫులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నివాళులర్పించారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ఆమె పేర్కొన్నారు. "మహాత్మా జ్యోతిరావు ఫూలే తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారు. మహిళా విద్య పురోగతికి ఆయన గణనీయమైన కృషి చేసి, సామాజిక సంస్కరణలు, సమ్మిళితత్వం అనే శాశ్వత వారసత్వాన్ని వదిలివెళ్లారు," అని రాష్ట్రపతి ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. పార్లమెంట్ ఆవరణలోని ఫులే విక్రమానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. ఉపరాష్ట్ర పతి, ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఫులే విగ్రహానికి నివాళులర్పించారు. ఫూలే ఏప్రిల్ 11, 1827న మహారాష్ట్రలో జన్మించి, నవంబర్ 28, 1890న మరణించారు.




