calender_icon.png 21 May, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాప్రమాణాలు మెరుగు పరచడంలో ప్రధానోపాధ్యాయులదే కీలక పాత్ర

21-05-2025 01:23:08 AM

కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, మే 20(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల లలో  విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం లో ప్రధానోపాధ్యా యులు కీలక పాత్ర వహించాలని  జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్  అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న జిల్లాస్థాయి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు  నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ నూతన బోధనా పద్ధతులను మెరుగుపరుచుకుంటూ ఉపాధ్యాయులను దిశ నిర్దేశం చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన విద్యాబోధన విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు.

ఇప్పటికే మొదటి దశ శిక్షణ పూర్తయిందని, రెండవ దశలో 800 మందికి మారుతున్న కాలానికి అనుగుణంగా శిక్షణ అందించడం జరుగుతున్నదని తెలిపారు.  ప్రతి ప్రధానోపాధ్యాయులు సకాలంలో తల్లిదండులతో టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్య  పుస్తకాలు, యూనిఫారం సిద్ధంగా ఉంచుకోవాలి అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రాజు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్ ట్రైనింగ్ సెంటర్  ఇంచార్జి గంగా కిషన్, ఏ సీ జీ ఈ బలరాం, పరీక్షల కార్యదర్శి లింగం  పాల్గొన్నారు.