2023లోనే ఈసీకి అనుకూల చట్టం
సీసీటీవీ పుటేజీలు ఇచ్చేందుకు అభ్యంతరమేంటి?
అదానీ, అంబానీకి దోచి పెట్టేందుకు బీజేపీ కుయుక్తులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, ఆగస్టు 17: కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)పై ఎటువంటి చర్యలకు వీల్లేకుండా ఎన్డీయే ప్రభుత్వం 2023 లోనే ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందని, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షాకు ఈసీ సాయం చేస్తున్నందునే ఎన్డీయే ఈ చట్టం తీసుకొచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ఈ రోజు ఈసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. నేను వారిని ఒక్కటే అడగదలుచుకున్నా.
సీసీ టీవీ పుటేజీల విషయంలో ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు మార్చింది. ఎన్నికల కమిషనర్లపై ఎటువంటి కేసు నమోదు చేసేందుకు వీల్లేకుండా 2023లోనే చట్టం చేసింది. ఓట్లు చోరీ చేస్తున్నందుకు ఎవరూ చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకొ చ్చింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓట్ అనే సూత్రం ఉంది. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో మాకు ఎన్ని ఓట్లు పడ్డాయో.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంతే సంఖ్యలో ఓట్లు పడ్డాయి.
బీజేపీకి మాత్రం అదనంగా ఓట్లు పోలయ్యాయి. బతికున్న వారిని కూడా చనిపోయారని ఈసీ చూపుతోంది. గత ఎన్నికల్లో ఉన్న వారి పేర్లను ఈ ఎన్నికల జాబితాలో తొలగిస్తోం ది. కార్పొరేట్ శక్తులు అదానీ, అంబానీకి సాయం చేసేందుకు బీజేపీ మీ డబ్బును దొంగిలిస్తోంది’ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ ఆరోపణలపై వారం లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘం డెడ్లైన్ విధించింది.






