calender_icon.png 21 June, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్‌చార్జి మంత్రికి ప్రొటోకాల్ సెగ

21-06-2025 12:48:10 AM

  1. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల తోపులాట 
  2. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం పంపిణీలో రసాబాస 
  3. ప్రొటోకాల్ పాటించాలన్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి 
  4. మౌనం వహించిన ఇన్‌చార్జి మంత్రి వివేక్ 

సిద్దిపేట జూన్ 20 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ప్రోటోకాల్ సెగ ఎదురయింది. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గం ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్చార్జిమంత్రికి సిద్దిపేట, దుబ్బాక లలో బిఆర్‌ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

సిద్దిపేట మున్సిపల్ పరిధిలో బి.ఆర్.ఎస్ కౌన్సిలర్ల వార్డులలో గల లబ్ధిదారులకు న్యాయం జరగలేదని కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలంగా ఉన్న వర్గానికి మాత్రమే మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. అనంతరం ఇన్చార్జి మంత్రి వివేక్ కు వినతి పత్రం అందజేశారు. దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన మంజూరు పత్రాల పంపిణీలో వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రావడాన్నీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తప్పుపట్టారు.

ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కాంగ్రెస్ వర్సెస్ బిఆర్‌ఎస్ నాయకులు జిందాబాద్, డౌన్, డౌన్ అంటూ ఇరువైపులా నినాదాలు చేశారు. ఒక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్ బిఆర్‌ఎస్ నాయకులను అక్కడ నుంచి పంపించేశారు. ఆయా సమావేశాలలో మంత్రి వివేక్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆనాడు ఇందిరమ్మ పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లను అందించి పేద ప్రజల గుండెల్లో నిలిచారన్నారు.

పేద ప్రజల అభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నారని సొంత ఇల్లు ఉండాలన్న పేదల ఆశలను తీర్చేందుకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 12 వేల దరఖాస్తులు ఉన్నాయని మిగిలిన మూడేళ్లలో అందరికీ ఇండ్లు  మంజూరు చేస్తామన్నారు. పెద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు  రూ.900 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. 

మానిఫెస్టోలో లేకున్నా రూ. 13 వేల కోట్ల తో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. సొంతం ఇల్లు ఉండాలనే పేద ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా రూ.5 లక్షలతో 600 ఫీట్ల వరకు మాత్రమే ఇళ్ళు నిర్మించుకోవాలన్నారు.

విద్య, వైద్యం, ఇండ్లు, ఇరిగేషన్,  మౌలిక వసతులు కల్పన తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రిగా జిల్లా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, కలెక్టర్ హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ లు గరీమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్, ఆర్డీఓలు, హోసింగ్ పీడీ దామోదర్ రావు, తహసిల్దార్లు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.