01-06-2025 12:31:48 AM
భూపాలపల్లి/మహబూబాబాద్, మే 31 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమిష్టి కృషితో సరస్వతీ పుష్కరాలు విజయవంతంగా నిర్వహిం చామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సరస్వతీ పుష్కరాల విజయవంతం నేపథ్యంలో శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ‘డే ఆఫ్ థాంక్స్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు.
ఈ సందర్భం గా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. పుష్కరాలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులపాటు 24 గంటల పాటు కష్టపడ్డారని కొనియాడారు. పుష్కరాల విజయవంతంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని చెప్పారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని సరస్వతీ పుష్కరాల నిర్వహణను ప్రభుత్వం ఒక ఉపోద్ఘాతంగా తీసుకుంటుందని మంత్రి తెలిపా రు.
పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం 40 కోట్లు కేటాయించిందన్నారు. సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శిం చుకున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు చాలా కష్టపడ్డారని, పుష్కరాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషిం చారని, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు రూ.10 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. కొందరు సరస్వతీ పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న చిన్న అంశా లను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారని అయినా భక్తులు అవన్నీ పట్టించుకోకుండా లక్షల్లో తరలివచ్చి పుష్కర స్నానా లు చేశారన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్య వాదాలు తెలిపారు.
కాళేశ్వరానికి వెళ్లే జాతీ య రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చు డతామని అన్నారు. పుష్కరాల సందర్భంగా జరిగిన ప్రమాదంలో మరణించిన కొమరవెల్లి గ్రామస్థులకు రూ.లక్ష ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే వడదెబ్బకు గురై మరణించిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.