03-02-2026 03:11:29 PM
ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది?
లోక్ సభలో మరోసారి గందరగోళం
న్యూఢిల్లీ: లోక్సభలో(Parliament Budget Session) మంగళవారం మరోసారి గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంపై లోక్సభలో మళ్లీ ప్రస్తావించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎన్డీయే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లడఖ్ లో మన సైనికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. లడఖ్ పై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ట్రేడ్ డీల్ పై విపక్షాల నిరసన
అమెరికాతో ట్రేడ్ డీల్(India-US trade deal)పై విపక్షాలు నిరసన చేపట్టాయి. పార్లమెంట్ బయట, లోపల విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. పాకిస్థాన్ తో కాల్పుల విరమణ లాగే యూఎస్ తో వాణిజ్య ఒప్పందం అంటూ నినాదాలు చేశారు. అన్ని విషయాలు ట్రంప్ ప్రకటిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. అమెరికాతో ట్రేడ్ డీల్ పై పూర్తి వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారు
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై(US Trade Agreement) తీవ్ర విమర్శలు చేశారు. మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారని, మోదీ చాలా భయంలో ఉన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తీవ్ర ఒత్తిడితోనే ఒప్పందంపై సంతకాలు చేశారని ఆరోపించారు. రైతుల రక్తమాంసాలు కేంద్రం అమ్ముకుందని ఆవేదన వ్యక్త ంచేశారు. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారని ద్వజమెత్తారు. ఆందోళనల మధ్య లోక్ సభ వాయిదా పడింది. స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి ఎంపీలు నిరసన తెలిపారు. విపక్ష ఎంపీలు స్పీకర్ పైకి పేపర్లు విసిరారు.