14-05-2025 12:31:39 AM
యాదాద్రి భువనగిరి మే 13 ( విజయ క్రాంతి ) : రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలని గొప్ప సంకల్ప బలంతో రాజీవ్ యువ వికాసానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం తో ఈ పథకానికి బలాన్ని చేకూర్చాలని జిల్లా యంత్రాంగం సన్నద్ధమయింది.
అనుకున్నదే తడవుగా రాజీవ్ యువ వికాస పథకం అమలు చేయడమే లక్ష్యంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలన చేస్తూ అర్హులను ఎంపిక చేస్తూ వారికి రుణాల అందించాలని జీవన ప్రగతి పెంచాలని ఆర్థికంగా బలోపేతం చేయాలని మండల ప్రత్యేక అధికారుల కు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా కలెక్టర్ సోమవారం సంబంధిత మండల ప్రత్యేక అధికారులతో సమీక్షించి రాజీవ్ యువ వికాస లక్ష్యాలను సాధించాలన్నారు.
బ్యాంకుల ధృవీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా ఎల్డీఎం కె. శివరామకృష్ణ తో కలిసి భువనగిరి ఎస్బీఐ స్టేషన్ రోడ్ బ్రాంచ్ను ఆకస్మికంగా సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తులపై బ్యాంకర్ల ధృవీకరణ పురోగతిని పరిశీలించారు.
బ్రాంచ్ మేనేజర్ అశోక్ సాయిని ధృవీకరణ ప్రక్రియను అత్యవసర ప్రాతిపదికన త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి కూడా అన్ని శాఖలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు.
అంతకుముందు కలెక్టర్ గారు బ్యాంకర్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, బ్యాంక్ శాఖలను సందర్శించి, దరఖాస్తుదారుల క్రెడిట్ నివేదికలను ధృవీకరించడంలో బ్యాంకులకు అవసరమైన సిబ్బందిని ఇవ్వాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.