25-06-2025 01:00:54 AM
నల్లగొండ ప్రతినిధి, జూన్ 24(విజయక్రాంతి) : అది పేరుకే డిఫెన్స్ అకాడమీ.. ఆర్మీ, నేవీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటూ హంగూ అర్భాటాలతో ప్రచారం.. రంగురంగుల బ్రోచర్లు.. మాయ మాటలు.. శాంపిల్స్ టెస్టులు.. ఇలా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అరచేతిలో వైకుంఠం మాదిరి చూపించి.. రూ.లక్షలకు రూ.లక్షలు ఫీజుల దోపిడీకి దిగుతున్నారు. రెండు మూడేండ్లలో కొలువులంటూ నయా దందాకు తేరలేపారు.
అదే నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో రామయ్య డిఫెన్స్ అకాడమీ. నిజానికి కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చాక.. కేంద్ర భద్రత బలగాల కొలువులు ఆశించేవారి పరిస్థితి డొలాయమానంలో పడింది.
కానీ రామయ్య డిఫెన్స్ అకాడమీ మాత్రం తన మాయ మాటలతో బురిడీ కొట్టించి అడ్మిషన్ల పేరుతో ఇంటిగ్రేటేడ్ కోర్సులంటూ ప్రతి ఏటా రూ.కోట్లు దండుకుంటున్నారు. ఏండ్ల తరబడిగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ తరహా దందా జరుగుతున్నా.. జిల్లా యంత్రాంగం కన్నెత్తి అటువైపు చూడకపోవడం కొసమెరుపు.
అకాడమీకి అనుమతుల్లేవ్..
ప్రస్తుతం చర్లపల్లిలో నిర్వహిస్తున్న రామయ్య డిఫెన్స్ అకాడమీని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నడిపేస్తున్నారు. వాస్తవంగా రామయ్య డిఫెన్స్ అకాడమీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులంటూ విద్యార్థులకు ఎర వేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యతో పాటు కేంద్ర భద్రత బలగాల కొలువులు సాధించేలా తీర్చిదిద్దుతామని నమ్మబలుకుతున్నారు. అందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.1.50 లక్షలకు పైగా వసూలు చేస్తుండడం గమనార్హం.
అసలు విషయం ఏమిటంటే.. రామయ్య డిఫెన్స్ అకాడమీకి ఇంటర్మీడియట్ అనుమతులు లేవు. కానీ నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో విద్యార్థికి అడ్మిషన్ చేయించి.. చర్లపల్లిలోని రామయ్య డిఫెన్స్ అకాడమీలో క్లాసులు చెబుతుండడం కొసమెరుపు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అసలు అనుమతి లేకుండానే ఇంటర్ కాలేజీని నిర్వహించడమనేది అతిపెద్ద క్రైమ్ అని చెప్పాలి.
ప్రతి విద్యార్థి దశలో కీలకంగా భావించే ఇంటర్ దశలోనే విద్యార్థిని రామయ్య డిఫెన్స్ అకాడమీ మిస్ గైడ్ చేస్తోంది. సదరు ప్రైవేటు కాలేజీలో తరగతులకు హాజరుకావాల్సి ఉన్నా.. ఏనాడూ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు అడుగుపెట్టే పరిస్థితి ఉండదు.
ఎందుకంటే.. అసలు రామయ్య డిఫెన్స్ అకాడమీ నుంచి తాము ఇంటర్ పూర్తి చేస్తున్నామని అనుకుంటున్నారే తప్ప.. ఇతర కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్న సంగతి విద్యార్థులకు తెలియకుండా రామయ్య డిఫెన్స్ అకాడమీ జాగ్రత్త పడుతోంది.
జిల్లా యంత్రాంగానికి పట్టింపు లేదా..?
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ భారీ స్థాయి దందా ఏండ్ల తరబడిగా సాగుతున్నా.. జిల్లా యంత్రాంగానికి కాసింతైనా పట్టింపులేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అసలే ఓ వైపు ప్రైవేటు విద్యాసంస్థల నిలువు దోపిడీతో అప్రతిష్టను మూటగట్టుకుంటున్న విద్యాశాఖ.. రామయ్య డిఫెన్స్ అకాడమీ వ్యవహారాన్ని తేల్చకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియడం లేదు.
నిత్యం జిల్లా స్థాయి అధికారులు ఉండే నల్లగొండ జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉండడం.. అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి అనుమతులు లేని విద్యా సంస్థల్లో చదివి దారుణంగా మోసపోయిన ఘటనలను జిల్లాకు అనుకుని ఉన్న హైదరాబాద్లో ఇటీవల కాలంలో చూశాం.
కానీ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్నా.. పట్టింపులేకపోవడం దారుణమనే చెప్పాలి. ఏదైనా ఘటన జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందు జాగ్రత్తగా అలర్ట్ అయ్యి విద్యార్థులను భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.