03-07-2025 12:57:18 AM
- నాలుగు క్రిటికల్ క్యాన్సర్ ఆపరేషన్లను సక్సెస్ చేసిన వైద్య బృందం...
- వివరాలు వెల్లడించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్
ఆదిలాబాద్, జూలై 2(విజయక్రాంతి) : మారుమూల ఆదిలాబాద్ లో ఏర్పాటైన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇటీవల అరుదైన శత్ర చికిత్సలు చేస్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతోందని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి లో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తాజాగా ఆసుపత్రిలో నలుగురికి అన్నవాహిక క్యాన్సర్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
బుధవారం రిమ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వైద్యులతో కలిసి ఆయన మాట్లాడారు. సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో ఓ క్యాన్సర్ పేషంట్ ఒక ఊపిరితిత్తును స్తంభింప చేసి, కడుపులో నుండి ఏకంగా అన్నవహికను తొలగించి, పెద్ద సంచిని అన్నవాహికగా మార్చడం జరిగిందని, తిరిగి పేషంట్ ను యధావిధి పరిస్థితికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఇటువంటి అరుదైన శస్త్ర చికిత్సలు ఆరునెలల కాలంలో దాదాపు మూడు వందలకు పైగా చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అన్ని విభాగాల్లోనూ అరుదైన శస్త్ర చికిత్సలు జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో ఆర్.ఏం.ఓ చంపత్ రావు, వైద్యులు జక్కుల శ్రీకాంత్, దేవిదాస్, సత్యనారాయణ, బండారి నరేందర్, హిమాని, సతీష్, కార్తీక్, విజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.