అమెరికా/ఇజ్రాయెల్-ఇరాన్ వార్ — వడ్డీ రేట్లపై RBI కీలక ప్రకటన
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించారు. ఆరు వారాలుగా కొనసాగుతున్న అమెరికా/ఇజ్రాయెల్-ఇరాన్(US/Israel-Iran War) ఘర్షణలో కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనే ఆశల మధ్య, రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఊహించిన విధంగానే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటు 5.25(Repo Rate 5.25%) శాతంగానే కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.7 శాతంగా, ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది.
నెలన్నరగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంఘర్షణ(West Asia Conflict) ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగించి, ముడి చమురు ధరలను విపరీతంగా పెంచి, భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలపై ఆర్థిక, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను సృష్టించిన నేపథ్యంలో ఈ విధాన నిర్ణయం వెలువడింది. గత నెలలో ప్రభుత్వం ఆర్బీఐ కోసం కొత్త ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ప్రకటించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ద్రవ్య విధాన సమీక్ష ఇదే. మార్చి 2031తో ముగిసే మరో ఐదేళ్ల పాటు, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగానూ, ఇరువైపులా 2 శాతం హెచ్చుతగ్గుల పరిధితోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆర్బీఐని కోరింది. ద్రవ్యోల్బణానికి ఇటీవల పెరిగిన ఇంధన ధరలు ముప్పుగా మారాయని ఆర్బీఐ వెల్లడించింది. ఇంధన ధరలు, హర్మూజ్ వద్ద ఆటంకాలు వృద్ధిపై ప్రభావం చూపనున్నాయని తెలిపింది.




