21-06-2025 01:28:37 AM
మాకు వివాదాలు వద్దు
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ‘బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం కేంద్రానికి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టు) ఇవ్వడం వల్లే వివాదం మొదలైంది.. పీఎఫ్ఆర్ కేంద్రానికి ఇచ్చే ముందు తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. బనకచర్ల అంశంపై కూర్చొని మాట్లాడుకుంటే వివా దం ఉండదని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు.
2016లోనే బనకచర్లకు పునాది పడిందన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం పీఎఫ్ఆర్ ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తోందని, బనకచర్లపై కేంద్రం అన్ని రకాల చర్యలకు సిద్ధమైందని సీఎం రేవంత్రెడ్డి వివరించారు. ‘ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై ఇద్దరు సీఎంలను కూర్చొని చర్చిద్దాం.. ఒక రోజు కాదు నాలుగురోజులైనా చర్చిద్దాం.. రాష్ట్రాల మధ్య జలవివా దాలు చర్చల ద్వారానే పరిష్కారమవుతా యి.
న్యాయ, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం. వివాదాల పరిష్కారంలో నాకు ఎలాంటి బేషజాలు లేవు. ఇది ఇద్దరు వ్యక్తుల సమస్య కాదు..రెండు రాష్ట్రాల మధ్య వ్యవహరం ఇది. విభజనచట్టం ప్రకారం ప్రాజెక్టుల్లో మార్పులు చేస్తే చెప్పుకోవాలి. విభజన చట్టం ప్రకారం గతంలో సీఎంల స్థాయిలో చర్చలు జరిపి.. అనేక అంశాలను చర్చించాం’ అని రేవంత్ తెలిపారు. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దని, పైన, కింద ఉన్న రాష్ట్రాలతో వివాదం కోరుకోవడం లేదన్నారు.
కింది రాష్ట్రంగా ఏపీకి హక్కు లు ఉంటాయని, అదే రకమైన హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈనెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో బనకచర్లపై చర్చిస్తామని తెలిపారు. ఒక అడుగు ముందుకేసి తామే ఏపీని చర్చలకు పిలుస్తామని సీఎం పేర్కొన్నారు.
కావాలంటే ఏపీ సీఎం చంద్రబాబును తానే స్వయంగా మీటింగ్కు ఆహ్వానిస్తానని తెలిపారు. ఎవరి ప్రయోజనాల కోసమో తమ రాష్ట్ర హక్కులను వదిలేసుకోబోమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు నీళ్లు ఉపయోగించుకున్నాకే మిగిలిన నీళ్లలో వరద నీళ్లు ఎంత అనేది తేలుతుందన్నారు.
మోదీ సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సపోర్టు కావాలి..
‘ప్రధాని మోదీ సీట్లో కూర్చోవాలంటే.. చంద్రబాబు సపోర్టు కావాలి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటే గోదావరి నీటిని తరలించాలి’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉందని, బనకచర్ల ప్రాజెక్టు అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు అని తెలిపారు.
బకనచర్లపై తెలంగాణ రాష్ట్రం అభిప్రాయం తప్పకతీసుకోవాల్సిందేనని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. 2016, 2018లో ఏపీ సర్కార్ రెండు జీవోలు ఇచ్చిందన్నారు. ఈ జీవోల ఆధారంగానే వ్యాప్కోస్ 150 పేజీల నివేదిక ఇచ్చిందని సీఎం చెప్పా రు. గోదావరి-పెన్నా అనుసంధానంలో బనకచర్ల ఒక భాగమని, 86రోజుల్లో 400టీఎంసీల నీటిని తరలించేలా బనకచర్ల డిజైన్ చేశారని ఆయన వివరించారు.
గోదావరిలో 968 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు తెలంగాణకు ఉందని, అయితే కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం ఇవ్వకపోవడంతోనే వివాదం మొదలైందని తెలిపారు. కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిదని, ఈ వివాదం పరిష్కారానికి ఎలాంటి డెడ్లైన్ లేదని సీఎం స్పష్టం చేశారు.
కేంద్రం వద్దకు చంద్రబాబు నేరుగా వెళ్తుతున్నారు..
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రం వద్దకు నేరుగా వెళ్తున్నారని, ప్రాజెక్టుల అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రమంత్రులు కూడా మీటింగ్లు పెట్టి అనుమతులపై చర్చిస్తున్నారన్నారు. తెలంగాణలో అభివృద్ధి కోసం తాము కూడా కేంద్రమంత్రులను కలుస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి కామెంట్స్ చేయనని, సమస్యల పరిష్కారానికి చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు..
తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిందంటే ఒకటి నిజాం, మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ పదేళ్ల పాలనలో కట్టిన ప్రాజెక్టు ఏదీ లేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. పోలవరంలో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అన్నారు. తెలివితేటలకు, పొడుగ్గా పెరగడానికి ఎలాంటి సంబంధం ఉండదని, అంత ఎత్తు పెరిగిన హరీశ్రావుకు తెలివి ఎంతుందో అందరికీ తెలుసని సీఎం ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీశ్రావు చెబుతున్న అబద్ధాలు వింటే.. దేవుడు కూడా ఆశ్చర్యపోతాడని, తానేనా వీళ్లను సృష్టించింది అని ప్రశ్నించుకుంటాడని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు.
సంజీవనిలా వాడుకోవాలని చూస్తోంది..
తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ బతకాలంటే నీళ్ల అంశాన్ని సంజీవనిలా వాడుకోవాలని చూస్తోందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ ఇంతకాలం బతికిందన్నారు. మోదీకి చంద్రబాబు అవసరం ఎంతో ఉందో.. ఏపీలో టీడీపీకి కూడా గోదావరి నీళ్లు చాలా అవసరమని అన్నారు. ఏపీ ప్రభుత్వం వైఖరి బీఆర్ఎస్కు ఆయుధంలా మారిందని, రాజకీయంగా బతకడానికి జలరాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
కిషన్రెడ్డికి కేటీఆర్ ట్యూషన్ మాస్టర్..
కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై సీఎం రే వంత్రెడ్డి సీరియస్ అయ్యారు. కేటీఆర్ కు కిషన్రెడ్డి లైజనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ను తెలంగాణలో ట్విట్టర్ టిల్లు అని పిలుస్తారని సీఎం రేవంత్రెడ్డి సెటైర్ వేశారు. బీఆర్ఎస్ ఆర్గాన్ డొనేషన్ చేసింది కాబ ట్టే..పార్లమెంట్ ఎన్నిక ల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచిందన్నారు. కిషన్రెడ్డికి కేటీఆర్ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్ గా పనిచేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ కోసం బీజేపీ, బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని, ఇప్పుడు వారి బంధం చాలా స్ట్రాంగ్ గా ఉందని ఆరోపించారు. ఈ బంధమే మెదక్లో బీఆర్ఎస్ను ఓడించిందని, అయినా వారికి బుద్ధిరావడం లేదని రేవంత్రెడ్డి మండిపడ్డారు.
బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆల్పార్టీ ఎంపీల మీ టింగ్ పెడితే కిషన్రెడ్డి రాలేదని, ఢిల్లీలో వేరే పనులు ఉన్నాయని చెప్పారన్నారు. కానీ, మేం కలవాలనుకున్న కేంద్రమంత్రులు సీఆర్ పాటిల్, ఖట్టర్ను కిషన్రెడ్డి ఒక రోజు ముందే కలిశారన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్పై కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.