35 రోజుల్లో 3.93 కోట్ల కానుకలు
29-05-2024 01:04 AM
రికార్డుస్థాయిలో యాదాద్రి నరసింహుడి ఆదాయం
యాదాద్రి భువనగిరి, మే 28 (విజయక్రాంతి): భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి వేసవి సెలవుల్లో భక్తులు రికార్డుస్థాయిలో హుండీ కానుకలు సమర్పించారు. మంగళవారం ఆలయ అధికారులు హుండీ కానుకలను లెక్కించగా, 35 రోజుల్లో రూ.3,93,88,092 నగదు, 174 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల వెండి సమకూరినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ భాస్కర్రావు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో హుండీ కానుకల ఆదాయం రావడం ఆలయ చరిత్రలో రికార్డుగా పేర్కొన్నారు. ఈ కానుకలతోపాటు విదేశీ కరెన్సీ సైతం పెద్ద ఎత్తున వచ్చినట్టు వెల్లడించారు. కాగా, మంగళవారం స్వామివారికి నిత్యపూజలు నిర్వహించారు. ఒక్కరోజే స్వామివారికి రూ.36,59,794 ఆదాయం వచ్చినట్టు అధికారులు ప్రకటించారు.






