31-10-2025 12:31:33 AM
 
							హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని, పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పున రావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహా యం అందించాలని ఆదేశించారు.
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభా కర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి , సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాతో పాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ అన్ని చోట్ల వరి కోతలు మొదలయ్యాయని, అనుకోని ఉపద్రవం ఏది వచ్చినా రైతులకు ఆవేదన మిగులుస్తుందన్నారు.
ఫంక్షన్హాళ్లలోనైనా ధాన్యం నిల్వ చేయాలి..
రాష్ర్టంలో ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్లుగా పౌరసరఫరాల విభాగం కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలన్నారు. వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవటం రైతులు నష్టపోవటం ఆందోళన కలిగించిందని తెలిపారు. కళ్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మిల్లుల, గోదాములు అందుబాటులో లేని చోట దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికో ఇన్ఛార్జీ అధికారిని నియమించాలని, ఇప్పుడున్న ఇన్ఛార్జీలు నిర్లక్ష్యంగా ఉంటే వేరే వాళ్లను నియమించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతీ ఐకేపీ సెంటర్ నుంచి ఏరోజుకారోజు సాయంత్రం రిపోర్టు తెప్పించుకోవాలని, రిపో ర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసి అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించేలా, ప్రజలకు అందుబా టులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
వరదలు తగ్గాకా పంట నష్టంపై అంచనా వేయాలి..
వర్షాలకు ధాన్యం తడవకుండా తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని, విధానపరమైన నిర్ణయాలు అవసరమైతే వెం టనే సివిల్ సప్లయిస్ కమిషనర్, సీఎస్ దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. వరద తగ్గిన తర్వాత వ్యవసాయ, రెవిన్యూ విభాగం అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి నష్టపు అంచనాలు తయారు చేయాలని నివేదించారు. తుఫాను, వర్షాల ప్రభావము న్న జిల్లాల్లో చేపడుతున్న సహాయక చర్యలు, రోడ్లు, రహదారుల పునరుద్ధరణ చర్యలు, ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఇంచార్జ్ మంత్రులు సమీ క్షించాలని సీఎం కోరారు. తమ సొంత జిల్లా ల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, ఇన్ఛార్జీగా ఉన్న జిల్లాల్లో ప్రజలను ఆదుకునే చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు.
16 జిల్లాలలో తుఫాన్ ప్రభావం..
ఇప్పటికే రాష్ర్టంలో 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలతో పాటు ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, వెంటనే విద్యుత్తు పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని అన్నా రు. వర్షాలతో ఖమ్మం జిల్లాలో ఒక డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని సీఎం అన్నారు. అన్ని రోడ్లు, రహదారులపై ఉన్న బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వేలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని సీఎం అన్నారు. రోడ్లు, రహదారులపైకి వరద నీళ్లు వచ్చే ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాలు అటువైపు వెళ్లకుండా పోలీసులు నిషే ధాజ్ఞలు అమలు చేయాలన్నారు. స్థానిక సీఐ, రెవిన్యూ అధికారులు వాహనాలు అటువైపు వెళ్లకుండా రెండు వైపులా బారికేడ్లు పెట్టాలన్నారు. దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ను డైవర్ట్ చేయాలని, కుంభ వృష్టి కురిసే సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, అత్యవ సర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైడ్రా టీమ్లను తీసుకెళ్లాలి..
వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే హైదరాబా ద్ నుంచి హైడ్రా టీమ్లను, అవసరమైన సామగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వరంగల్లో తక్షణ సహాయక చర్యలకు అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీకి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని కూడా అత్యవసరమైన చోట వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 9 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి రెండు వేల మందిని వరంగల్లో వరద ప్రాం తాల్లో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, ఎక్కడైనా వరదలో ఇండ్ల కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీటితో పాటు, ఫుడ్ పాకెట్లు సరఫరా చేయాలని సూచించారు. వరంగల్లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ము మ్మరం చేయాలని, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్ట రేట్లో టోల్ ఫ్రీ హెల్ప్ సెల్ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాష్ర్ట స్థాయిలోనూ కమాండ్ కంట్రోల్ సెం టర్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వర్షాలు, వరదలు, విపత్తులు వచ్చినప్పుడు స్పందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
నేడు వరంగల్, హుస్నాబాద్లో సీఎం ఏరియల్ సర్వే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాం తాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు. ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది.
వాతావరణం అనుకూలించకపో వటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలుకాదని ఏరియల్ సర్వేకు అధికారులు అను మతించలేదు. వాతావరణం అనుకూలించకపోవటంతో తాను రాలేకపోయానని, శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాం తాల్లో ఏరియల్ సర్వేకు వస్తానని వీడి యో కాన్ఫరెన్స్లో సీఎం ప్రకటించారు.