07-06-2025 12:00:00 AM
నాలాపై నిర్మాణాలను కూల్చిన హైడ్రా అధికారులు
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): సికింద్రాబాద్ బేగంపేటవ్యూట్నీ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరఢా ఝులిపించారు. శుక్రవారం పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించారు. పాట్నీ నాలాపై ఆక్రమణలను కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి తొలగించారు.
నాలాను ఆనుకొని ఉన్న రెండు భవనాలను కూల్చివేశారు. గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్యాట్నీ నాలాను పరిశీలించి, నాలాపై ఆక్రమణలు గుర్తించారు. దీంతో శుక్రవారం ఉదయాన్నే బుల్డోజర్లతో అక్కడి చేరుకున్న హైడ్రా సిబ్బంది ఆక్రమణలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుచించుకుపోవడంతో వరదలు వచ్చినప్పుడు కాలనీలు, ఇండ్లలోకి నీరు ప్రవేశిస్తున్నదని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలు చేపట్టారు.