06-06-2025 12:51:50 AM
- శంషాబాద్ మండలం గొల్లపల్లి కుర్దులో రెవెన్యూ సదస్సు
- సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచన
రాజేంద్రనగర్, జూన్ 5: తమ భూములను నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్)లో నుంచి తొలగించాలని 30 మంది రైతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి మొరపెట్టుకున్నారు. గురువారం శంషాబాద్ మండల పరిధిలోని గొల్లపల్లి కుర్దులో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తమ భూములు ఎయిర్పోర్టు నిర్మాణంలో తీసుకోకపోయినా నిషేధిత జాబితాలో ఉ న్నాయని ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము చాలాకాలంగా ఈ సమస్య పరిష్కారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను పూర్తిస్థాయిలో సమీక్షించి న్యాయం జరిగేలా తగిన చొరవ తీసుకుంటానని ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి వారికి హామీ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల భూ సమ స్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఏమైనా సమస్యలు ఉంటే ఆయా గ్రామాల్లో నిర్వహించే సదస్సుల్లో అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకటరెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్, నాయబ్ తహసిల్దార్ సుబ్రహ్మణ్యం, రెవెన్యూ అధికారులుపాల్గొన్నారు.