13-06-2025 02:29:22 AM
మహబూబాబాద్, జూన్ 12 (విజయ క్రాంతి): విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పండగ వాతావరణం కనిపించింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. పాఠశాలల గేటు ముందు మామిడి తోరణాలు కట్టి, సుందరంగా ముస్తాబు చేశారు.
గ్రామాల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్న నూతన విద్యార్థులకు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. పలుచోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు మేళ తాళాలతో ర్యాలీ నిర్వహించారు.
తొలి రోజే పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందజేత
ప్రభుత్వం ఈసారి పాఠశాలలు ప్రారంభించే రోజే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందజేయడంతో పాటు వసతుల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకూడదని ఆదేశాలు జారీ చేయడంతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.
గురువారం పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు ఒక జత దుస్తులు, పాఠ్యపుస్తకాలను అందజేయడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ ఎ. రవీందర్ రెడ్డి, ఇతర విద్యాశాఖ పర్యవేక్షక అధికారులు, మండల విద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు పాఠశాలల ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.
పలుచోట్ల విద్యార్థులు గైర్హాజర్?
జిల్లావ్యాప్తంగా అత్యధిక పాఠశాలలో పండగ వాతావరణం నెలకొనగా, అక్కడక్కడ కొన్ని పాఠశాలలకు విద్యార్థులు రాకుండా ముఖం చాటేశారు. కేసముద్రం మండలం కొత్తూరు ప్రాథమిక పాఠశాలకు ఒక్క విద్యార్థి కూడా రాకుండా ముఖం చాటేశారు. అలాగే జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం ఆశించినంతగా లేకపోవడంతో వెలవెలబోయాయి.