వర్షాకాలానికి ముందే విద్యాలయాల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, విద్యాలయాల్లో మరమ్మతు పనులను వర్షాకాలంలోపు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరమ్మతులు చేయాల్సిన పనులను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ, మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో మరమత్తులకు సంబంధించి ప్రతిపాదనలు అందజేయాలని, సంబందిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 31 పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్లు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలో నూరు శాతం మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా ఉండాలని స్పష్టంచేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా పునరుద్ధరణ పనులను మే 10 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తి అయిన పనులకు అగ్రిమెంట్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ‘వెల్ఫేర్ వీక్’ సందర్భంగా అన్ని రకాల సంక్షేమ హాస్టల్లో సంబంధిత శాఖల సంక్షేమ అధికారులు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, బిసి సంక్షేమ అధికారి ఇందిర, పీఆర్, గిరిజన, టీడబ్లుఐడిసి ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ సునీత, ఎంపిడివో సురేందర్, సర్పంచ్ విజయ, ప్రిన్సిపల్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.






