వైభవంగా బోనాల పండుగ వేడుకలు
ఘట్ కేసర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): బోనాల పండగను ఆదివారం ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల, కాచవాని సింగారం, అన్నోజిగూడ, పోచారం ప్రాంతాలలోని ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు మహిళలు నైవేధ్యంతో కూడిన బోనాలతో శివసత్తుల పూనకాలతో వెంటరాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి అమ్మవారి ఆలయాలకు చేరుకుని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు చేరు కోవడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ బోనాల ఉత్సవంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం యువకులు తీసిన తొట్టెల, పలహారపుబండి ఊరేగింపులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.






