30-05-2025 10:58:04 AM
యధావిధిగా మానుకోటలో హాల్టింగ్
మహబూబాబాద్, (విజయక్రాంతి): విజయవాడ కాజీపేట రైల్వే సెక్షన్(Vijayawada Kazipet Railway Section)లో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ఎన్ ఐ (నాన్ ఇంటర్ లాకింగ్), మూడో లైన్ ఏర్పాటు కోసం గత ఐదు రోజుల క్రితం పలు రైళ్లను రద్దు చేయడం, ఇంకొన్ని రైళ్లను విజయవాడ నల్లగొండ మీదుగా దారి మళ్ళించడం జరిగింది. అలాగే మరికొన్ని రైళ్లను మహబూబాబాద్ లో కాకుండా కేసముద్రం రైల్వేస్టేషన్లో(Kesamudram railway station) హాల్టింగ్ కల్పించారు.
దీనితో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ప్రజలతో పాటు ఇతర జిల్లాలు, ఇతర ప్రాంతాల నుండి మహబూబాబాద్ కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఐదు రోజుల అనంతరం శుక్రవారం నుండి విజయవాడ కాజీపేట సెక్షన్ లో రైళ్ల రాకపోకలను యధావిధిగా ప్రారంభించారు. రద్దు చేసిన రైళ్లను తిరిగి పునః ప్రారంభించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లకు తిరిగి యధావిధిగా హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే శాఖ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడంతో ఐదు రోజులపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు ఉపశమనం కలిగించింది.