30-05-2025 10:55:44 AM
ముగ్గురు ఎమ్మెల్యేల ప్రెస్ మీట్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): 30 ఏళ్లలో తొలిసారిగా దేవపూర్ సిమెంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న పుస్కూరి విక్రమ్ రావును గెలిపించాలని బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్, బొజ్జుపటేల్ కోరారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో బరిలో ఉన్న ఐ ఎన్టీయూసీ అభ్యర్థి విక్రoరావుతో కలిసి శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివాసీ సంఘాలు బలపరుస్తున్న విక్రం రావును గెలిపించాలన్నారు. గడ్డం వెంకటస్వామి (కాకా) కుటుంబం తొలినుంచి కార్మికుల పక్షాన నిలబడి పని చేస్తుందని వెల్లడించారు. సింగరేణి కార్మికులకు పెన్షన్, ప్రైవేట్ ఫండ్, సాధించిన ఘనత వెంకటస్వామికే ఉoదన్నారు.
మూతపడే స్థితిలో ఉన్న సింగరేణి సంస్థను మా నాయన వెంకట స్వామి కాపాడారన్నారు. దేవపూర్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విక్రమ్ రావును గెలిపిస్తే కార్మికుల హక్కులను కాపాడుతామన్నారు. కార్మికుల సంక్షేమం ద్యేయంగా పనిచేస్తామన్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓరియంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు ఐక్యంగా నిలబడి ఓరియంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐ ఎన్ టీ సీయూ అభ్యర్థి పుస్కూరి విక్రంరావు భారీ మెజార్టీతో గెలిపించాలని బుజ్జి పటేల్ ఆదివాసీ సంఘాలకు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా గిరిజన సంఘాలు ఉంటాయన్నారు. ఆదివాసి సంఘాలన్నీ ఒకతాటిపై నిలబడి ఓరియంట్ సిమెంట్ గుర్తింపు సంఘ ఎన్నికల్లో విజయకేతనంలో కీలక భూమిక వహించాలన్నారు.
- అందుబాటులో ఉండి కార్మికులకు సేవ చేస్తా..
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తనను గెలిపిస్తే కార్మికుల సేవకు అంకితమై పని చేస్తానని ఐ ఎన్ టీయూ సీ అభ్యర్థి పుస్కూరి విక్రమ్ రావు హామీ ఇచ్చారు. స్థానికుడిని నీ ఎల్లవేళ కార్మికులకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్, దావ రమేష్, కంకటి శ్రీనివాస్, రత్నం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.