09-08-2024 02:55:00 AM
బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్రెడ్డికి పాలనపై పట్టులేదని, మంత్రులకు తమ శాఖల బాధ్యత తెలియదని, మార్పు పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసి అధికారం చేపట్టిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. గ్రామాల్లో పంచాయతీ సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదని, పన్ను వసూలు చేసే సిబ్బంది పస్తులుండే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం సిబ్బంది, తొమ్మిది జిల్లాల్లో మోడల్ స్కూల్ టీచర్లకు కూడా వేతనాలు ఇవ్వడం లేదని చెప్పారు.
జూనియర్ కళాశాల్లో ఉన్న అధ్యాపకులు, డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్లు, ఆశ వర్కర్లు జీతాలు పెంచాలని ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆగస్టు 15న వేతనంతోపాటు ఒక నెల బోనస్ ఇవ్వాలని డిమాండ్చేశారు. డీఏలు చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినా, ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరణ చేస్తామన్న హామీ ఆటకెక్కిందని, ఆరు నెలల్లో పీఆర్సీని వేసి కొత్త పేస్కేల్ అమలు చేస్తామని చెప్పిన మాటను నిలుపుకోవాలని సూచించారు. జీవో 33 ద్వారా తెలంగాణ విద్యార్థులు స్థానికులు కాకుండా పోతారని, పాత పద్ధతిని అమలు చేసి జీవోను సవరించాలని కోరారు.