10-06-2025 01:14:39 AM
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ‘బీజేపీ స్కూల్లో చదివితే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తారు.. కానీ రేవంత్ రెడ్డి మా స్కూల్లో డ్రాపవుట్ స్టూడెంట్ మాత్రమే’ అని రాజ్య సభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఏడాదిన్నర పరిపాలనలో భారీ అవినీతి జరిగిందని, తెలంగాణ సంపదను ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు.
కుర్చీ కాపాడుకునేందుకే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపడితే పూర్తి నిజాలు బయటకు వస్తాయని, రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని..అప్పులు తెస్తే కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
రాహుల్గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మి రాష్ర్ట ప్రజలు మోసపోయారన్నారు. 11ఏళ్ల నరేంద్ర మోదీ పాలన, రేవంత్రెడ్డి 18 నెలల పాలన బేరీజు వేస్తే.. తెలంగాణ సీఎం పాలన ఏందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీని కలవడానికి 45 సార్లు ఢిల్లీకి రేవంత్ వెళ్లారని, రేవంత్ తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారని..
ముఖ్యమంత్రి పదవిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాహుల్గాంధీ కోరిక మేరకే కులగణన, రిజర్వేషన్లు, మంత్రివర్గ విస్తరణ చేశారని తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని..ఆయన రాహుల్ రాయబారా లేక తెలంగాణకు జవాబుదారా? అని ప్రశ్నించారు.
బీజేపీ భరోసాకు చక్కని స్పందన..
రాజ్యసభ సభ్యుడు డా. కే లక్ష్మణ్ పాల్గొన్న బీజేపీ భరోసాకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న లక్ష్మణ్ ను సుమారు 100 మంది కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తాగునీటి సమస్య, పారిశుధ్య సమస్యలు, పెండింగ్లో ఉన్న పేదలకు పంపిణీ చేసేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత కుటుంబాల పునరావాస సమస్యలు, పెన్షన్లు, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్, నియామకాలు.. ఇలా సమస్యలను చెప్పుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, నలుగురు జిల్లా కలెక్టర్లు, వాటర్ వర్క్స్ ఎండీ, హెచ్ఎండీఏ అధికారులతో లక్ష్మణ్ ఫోన్ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీజేపీ తెలంగాణ ‘బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రోజూ ఒక ప్రజాప్రతినిధి -(ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) రాష్ర్ట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు.