హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషాదాన్ని మరోసారి ఒక రైతు దుర్మరణం రుజువు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) పేర్కొన్నారు. అప్పుల బాధతో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లిలో రవి నాయక్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలిచివేసిందని అన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు చూపిన నిర్లక్ష్య వైఖరి రైతు మరణానికి కారణం అయిందన్నారు. రైతుల ఆవేదనను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కూడా విఫలం అయిందన్నారు. ఇది కేవలం ఆసుపత్రుల నిర్లక్ష్యం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని తెలిపారు. రైతులను నిరాశలోకి నెట్టి, ఇటు జీవితంలో అటు మరణంలోనూ వారికి గౌరవం లేకుండా చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.