27-06-2025 02:17:24 AM
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట, జూన్ 26 (విజయక్రాంతి) : పదేండ్ల పాలనలో వేలకోట్లు సంపాదించిన ఘనత కేవలం బి.ఆర్.ఎస్ నాయకులకే దక్కిందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కాలేశ్వరం పేరిట కూలీశ్వరం ప్రాజెక్టు కట్టారనీ విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 18 నెలల కాలంలో రైతుల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేసి రైతుల మనసులో చెరగని ముద్ర వేశారన్నారు. గతంలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆంధ్రకు మేలు చేసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తూ కృష్ణ, గోదావరి జలాలను ఆంధ్రకు అప్పగించారన్నారు.
నాడు మంత్రి అయిన జగదీశ్ రెడ్డి వందల కోట్లు అక్రమంగా సంపాదించారని, శంషాబాద్ సమీపంలో 90 ఎకరాలలో గెస్ట్ హౌస్ నిర్మాణం చేసుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. పభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.