03-06-2025 02:55:25 PM
మూలుగుమాడు,(విజయక్రాంతి): నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి,సిఎల్పీ నేతగా తను ధరణి చట్టాన్ని ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా బంగాళాఖాతంలో వేసామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం మూలుగుమాడు గ్రామంలో భూభారతీ సర్వే పైలెట్ ప్రాజెక్టుపై రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి అని, రైతుల భూములు సర్వే చేయించి సంపూర్ణంగా సరిహద్దులు గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ చట్టం లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాల రాసిందని, అసలు రైతును ఆగం చేసిందని డిప్యూటీ సీఎం మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులు వాళ్లకు కావాల్సిన వ్యక్తులకు భూములు కట్టబెట్టి తిరిగి సవరణ చేసే అవకాశం లేకుండా ధరణి చట్టాన్ని తీసుకువచ్చారని, పది ఎకరాల భూమి ఉంటే 17 ఎకరాలకు పాస్ బుక్ లు ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగా ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేసామన్నారు. భూ సంస్కరణల చట్టంలో భాగంగా రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిందని, దానిని బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టంలోని పార్ట్ బిలో పెట్టి ఎటువంటి విచారణ చేయలేదని వ్యాఖ్యానించారు. తిరిగి ఆ అసైన్డ్ భూములన్నిటిని విచారించి అర్హులైన హక్కుదారులందరికీ భూ పట్టాలు ఇచ్చి వారి భూమిలో కూర్చోబెడతామని, భూమిలేని పేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలను భూభారతి చట్టంతో తిరిగి ప్రారంభిస్తున్నామని హామీ ఇచ్చారు.
ఆబాది భూమిని సర్వే చేసే అవకాశం కొత్త చట్టం కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి, గ్రామసభలో ఎవరు భూములు అమ్మారు.. భూ రికార్డుల్లో జరిగిన మార్పులను గ్రామ సభ ద్వారా వివరించే అవకాశాన్ని భూభారతి చట్టం కల్పిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. భూభారతి చట్టం ప్రజలు సాధించిన విజయం, రైతులు భూమికి ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కొలిచి అప్పగిస్తాం. పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేపడుతున్నాము అంటే ములుగుమాడు ఊరంతా కదిలి వచ్చింది. దీనిని బట్టి అర్థమవుతుంది ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప కీర్తి రాబోతుందని, భూభారతి చట్టం మన అందరిదీ అవగాహన చేసుకోవాలి పది మందికి వివరించాలి అని భట్టి విక్రమార్క సూచించారు.