15-10-2025 10:12:31 PM
దరఖాస్తుదారులు ఏది అడిగిన బండాగారంలో లేదంటూ తప్పుడు సమాచారం అందజేత
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందు మండల తహసిల్దార్ కార్యాలయంలో సమాచారం కోసం, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం, ఇల్లందు సింగరేణి భూముల విషయమై షెడ్యూల్ ప్రాంతమైన ఇల్లందులో సింగరేణికి ఎన్ని హెక్టార్ల భూమిని లీజుకు ఇచ్చారు. సింగరేణికి లీజుకు ఇవ్వడానికి ప్రజలతో గ్రామసభ నిర్వహించారా, ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నారు కదా అట్టి భూములను కూడా లీజుకు ఇచ్చారా అనే పలు అంశాలపై ఆర్టిఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) ద్వారా దరఖాస్తు చేశానని దరఖాస్తుదారుడు మాచర్ల విజయ్ కుమార్ తెలిపారు.
30 రోజులలో ఇవ్వవలసిన సమాచారం ఇవ్వకుండా, తహసిల్దార్ కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారున్ని తిప్పుకుంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. సమాచారం కొరకు తహసిల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేసి 40 రోజులు అయిందని అధికారులను అడగగా పొంతనలేని సమాధానంతో, మీరు అడిగిన సమాచారం బండాగారంలో లేదు అని సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో ఒక ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఇల్లందులో రెవిన్యూ అధికారులు మాత్రం సమాచార హక్కుని నిర్వీర్యం చేస్తున్నారని, ఇట్టి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.