04-06-2025 12:00:00 AM
భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ జూన్ 3 (విజయక్రాంతి): ధరణి తెచ్చిన అనర్ధాల నుండి రైతులు బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు తెచ్చిందని గ్రామాల్లోని రైతుల నుండి రెవెన్యూ అధికారులు వినతులు స్వీకరిస్తున్నామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.
మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ తొలి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్ర భుత్వం ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు.
రైతు పాసు పుస్తకంలో తన పేరు తప్పులు, విస్తీర్ణం తేడాలు, వారసత్వ భూముల వివరాలు, భూ స్వభావం లోపాలు, సర్వే నంబర్ మిస్సింగ్, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ వంటి అనేక భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని మిగతా 19 మం డలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో కూడా ఈ నెల 20వ వరకు సదస్సులు జరుగుతాయన్నారు.
ప్రతి మండలంలో రోజుకు రెండు గ్రామాల్లో రెవెన్యూ బృందాలు సదస్సులు నిర్వహించనున్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రొఫార్మాల ప్రకారం దరఖాస్తులు సదస్సుల సమయంలో ప్రజలకు అందజేస్తారని, దరఖాస్తుల స్వీకరణ అనంతరం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ఆగస్టు 14వ లోపు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదస్సుకు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితర అధికారులుహాజరయ్యారు