గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష
బోధన్, జూలై 24 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్ల పురోగతిని అదనపు కలెక్టర్ భుజంగరావు, బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పుష్కరాల నిర్వహణకు సంబంధించిన వివిధ శాఖల పనుల పురోగతిని అధికారులు వివరించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో బోధన్ ఆర్డీవో, ఎండోమెంట్, ఇరిగేషన్, మునిసిపల్ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో చేపడుతున్న పనుల వివరాలను వెల్లడించారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.






