12-11-2025 12:15:39 AM
నిజామాబాద్, నవంబర్ 11 (విజయ క్రాంతి): భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ఎడపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక అమలుపై సమీక్ష జరిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా కేటగిరీల వారీగా మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి ఉన్నారు.
సోయాబీన్ కొనుగోలు కేంద్రం తనిఖీ
బోధన్ మండలం చిన్నమావంది గ్రామంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. సోయాబీన్ పంట నాణ్యత, తేమ శాతంను పరిశీలించిన కలెక్టర్, ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల సోయాబీన్ సేకరణ జరిపారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మొక్కజొన్న, సోయాబీన్ సేకరణకు సంబంధించి పట్టా రైతు బయోమెట్రిక్ వేలి ముద్రను తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను అమలు చేస్తుండడం వల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు కౌలు రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సడలింపు ఇవ్వాల్సిందిగా రైతుల పక్షాన మరోమారు కోరతామని అన్నారు. మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్, వ్యవసాయ అధికారి సంతోష్ ఉన్నారు.