calender_icon.png 9 October, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో దుమారం!

08-10-2025 12:59:42 AM

మంత్రుల మాటల మంటలు

మంత్రి అడ్లూరిపై ‘బాడీ షేమింగ్’ వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం 

భగ్గుమంటున్న మాదిగ సామాజికవర్గం నేతలు 

  1. పొన్నం వ్యాఖ్యలను మరో మంత్రి వివేక్ ఖండించకపోవడంపై అసంతృప్తి  
  2. మంత్రి శ్రీధర్‌బాబుపైన వివేక్ మాట్లాడిన తీరుపై మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు  
  3. సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం 
  4. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్, మీనాక్షి దృష్టికి ఫిర్యాదు 
  5. సోనియా, ఖర్గే, రాహుల్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం 

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : కొందరు మంత్రుల మాటలు కాం గ్రెస్‌లో మంటలు రేపుతున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ‘ బాడీ షేమింగ్ ’ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాదిగ సామాజిక వర్గం నేతలు భగ్గుమంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి అడ్లూరితో పాటు కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సామాజిక వర్గం నేతలు ఢిల్లీ పెద్దలకు ఈ విషయం ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు.  ఒక వైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, మరో వైపు జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక  సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గానే పరిగణించింది.

నష్టనివారణ చర్యలు తీసుకోకపోతే మాదిగ సామాజిక నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ..కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. అయితే  ‘కాంగ్రెస్ పార్టీకి మాదిగలు అంటే ఇంత చిన్న చూపా..? బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వివేక్ ఖండించకపోగా పొన్నం చేసిన వ్యాఖ్యలను సమర్దించినట్లుగా మాట్లాడటం  ఏంటి..?’ అని సొంత పార్టోలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

అంతే కాకుండా మంత్రి శ్రీధర్‌బాబునుద్దేశించి వివేక్ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్‌లో హాట్ టాఫిక్‌గా మారాయి.  మంత్రి లక్ష్మణ్ కుమార్ ను పొన్నం ప్రభాకర్ కామెంట్ చేస్తుండగా.. పక్కనే ఉన్న వివేక్ కల్పించుకొని శ్రీధర్‌బాబు సైతం సమయానికి రాడు. ఆయన ట్రైనింగ్ లోనే లక్ష్మణ్ ఇలా వ్యవహరిస్తున్నాడు అన్న  వ్యాఖ్యలు కూడా పార్టీలో మరింత దుమారం లేపాయి. 

పొన్నం ఇంటిని ముట్టడిస్తాం..

మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను దూషించిన పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే పొన్నం ఇల్లు ముట్టడిస్తామని మాదిగ సామాజికవర్గ నేతలు హెచ్చరించారు. మరోవైపు మంత్రి వివేక్ పైన కూడా లక్ష్మణ్ కుమార్ అనుచరులు మండిపడుతున్నారు. దళిత మంత్రిని దూషిస్తుంటే కనీసం వారించకపోవడమేంటని వివేక్ తీరుపైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

మాదిగలంటే అంత చులకనా:  మాజీ మంత్రి మోత్కుపల్లి 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. మాదిగలంటే అంతా చులకన భావం ఉండటం ఎంతవరకు కరెక్టో పొన్నం ప్రభాకరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.. లక్ష్మణ్ కుమార్‌ను ‘దున్నపోతు’ అని అనాల్సిన అవసరం ఏముంది.? అలాంటి అనుచిత వ్యా ఖ్యలను ఎందుకు అనాల్సి వచ్చింది..? వెంట నే పొన్నం క్షమాపణలు చెప్పాలి’ అని మో త్కుపల్లి డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కూడా జోక్యం చేసుకోవాలని, పార్టీకి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభాకర్ కూడా తనకు మంచి మిత్రుడేనని, కానీ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లక్ష్మణ్‌ను ఎందుకలా అనాల్సి వచ్చిందని మోత్కుపల్లి నిలదీశారు. దళితుల సమస్యపై మంత్రి అడ్లూరి వద్దకు తాము వెళ్లితే పొన్నం చేసిన వ్యాఖ్యలతో కంటతడి పెట్టుకున్నారని, ఈ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా, మాదిగల తరపున ఖండిస్తున్నానని మోత్కుపల్లి తెలిపారు. పొన్నం ప్రభాకర్‌ను అనాలంటే తాము ఎన్నో అన్నగలమని, కానీ, ఒక రాజకీయ నా యకుడికిగా, సమాజంలో అన్ని వర్గాలను గౌరవించే వ్యక్తిగా తాము ఉంటామన్నారు. 

పీసీసీ చీఫ్‌కు అన్ని విషయాలు చెప్పా: మంత్రి పొన్నం

అడ్లూరి చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడారని, అక్కడితో వివాదానికి ఎండ్ కార్డు పడిందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహ్మత్‌నగర్‌లో మైనా ర్టీలకు సంబంధించిన కార్యక్రమంలో అసలు ఏమి జరిగిందో పీసీసీ అధ్యక్షుడికి పూర్తిగా వివరించినట్లు తెలిపారు. 

నేడు ఇద్దరు మంత్రులతో పీసీసీ చీఫ్ భేటీ 

మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌తో పీసీసీ అధ్యక్షు డు మహేష్‌కుమార్‌గౌడ్  బుధవా రం భేటీ కానున్నారు. మంత్రి లక్ష్మణ్‌పై పొన్నం చేసిన అనుచిత వ్యాఖ్య లతో ఇప్పటికే సొంత పార్టీ, మాదిగ సామాజిక వర్గం నుంచి విమర్శలు ఎదురవుతుండటంతో మహేష్‌కుమార్‌గౌడ్  స్పందించారు. ఫోన్‌లో ఇద్దరు మంత్రులతో మాట్లాడిన సం యమనం పాటించాలని సూచించా రు.

కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సా మాజిక వర్గం ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు, కాలే యాదయ్య,  తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు భేటీ అయ్యారు. మంత్రి పొ న్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని ఫి ర్యాదు చేశారు. మంత్రి లక్ష్మణ్‌పై చేసి న వ్యాఖ్యలు మొత్తం మాదిగ జాతిని ఉద్దేశించి చేసినట్లుగానే ఉన్నాయన్నారు. ఎవరు కూడా తొందరపడొ ద్దని పీసీసీ చీఫ్ వారికి సూచించారు.