ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
యూపీ: ఉత్తరప్రదేశ్లోని ఢిల్లీ-లక్నో హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హాపూర్లోని గర్ కొత్వాలి వద్ద అతివేగంతో దూసుకొచ్చిన కారు- ట్రక్రు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ... బ్రజ్ఘాట్ టోల్ ప్లాజా సమీపంలో సోమవారం మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది. కారు డ్రైవర్ నియంత్రణ తప్పి ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ వర్మ తెలిపారు. బాధితుల గుర్తింపును పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.






