16 April, 2026 | 6:30 AM

రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట

05-01-2026 05:46 PM

పెద్దపల్లి జిల్లా ఎ.ఎం.వి.ఐ మధు

ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు...

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని పెద్దపల్లి జిల్లా ఎ.ఎం.వి.ఐ మధు అన్నారు.జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో రోడ్డు భద్రతపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా ఎ.ఎం.వి.ఐ మధు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, పాఠశాల డ్రైవర్లు, ఉపాధ్యాయులకు రోడ్డు భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అయిన అధిక వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై వివరించారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగం ఎంత ముఖ్యమో విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. అలాగే ట్రాఫిక్ సంకేతాలు, జీబ్రా క్రాసింగ్ వినియోగం, పాదచారుల భద్రతపై అవగాహన కల్పించారు.విద్యార్థులు చిన్న వయసు నుంచే రోడ్డు భద్రత నియమాలను అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు సంబంధించిన బాధ్యతను తీసుకోవాలని ఆయన సూచించారు. డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో భద్రతా నియమాలపై చైతన్యం తీసుకురావాలని కోరారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై విలువైన సమాచారాన్ని పొందారు. పాఠశాల చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమం అందరిలోనూ రోడ్డు భద్రతపై బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించిందని  తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, డ్రైవర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.