రోడ్డుపై చిన్న నిర్లక్ష్యం..ప్రాణాలకు పెద్ద ముప్పు..
డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
కోదాడ జనవరి 13: రోడ్డుపై చిన్న నిర్లక్ష్యం కారణంగా వాహనదారుల ప్రాణాలకు పెద్ద ముప్పు వాటిల్లుతుందని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామం లోరాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలులో ఉన్న ‘అరైవ్ ఎలైవ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు, వాటి దుష్పరిణామాలు, ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు.
ప్రయాణ సమయంలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమే కాకుండా చట్టపరంగా నేరమని తెలిపారు. అలా పట్టుబడితే జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. అలాగే పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, త్రిబుల్ రైడింగ్ చేయరాదని, బైక్ రేసింగ్ లాంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.




