బీజేపీతో కలిసి ఆర్పీఐ (ఏ) పోటీ
- ఆర్పీఐ(అథవాలే) జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు
- బీజేపీ స్టేట్ చీఫ్ను కలిసిన ఆర్పీఐ (అథవాలే) నేత
ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి): రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలతోపాటు, భవిష్యత్తులో తెలంగాణలో జరిగే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలు కలిసి నడవడానికి ఒక బలమైన పునాది పడింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) జాతీయఅధ్యక్షుడు, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆదేశాల మేరకు తెలంగాణలో ఇరుపార్టీల మధ్య పొత్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఉమ్మడి పోటీపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే దిశానిర్దేశంలో ఆర్పీఐ (అథవాలే) తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును అధికారికంగా కలిసినట్లు ఆర్పీఐ జాతీయ కార్యదర్శి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్షుడు పేరం శివనాగేశ్వరరావు బుధవారం మీడియాకు వెల్లడించారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, ఆర్పీఐ కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై రామచందర్రావు సానుకూలంగా స్పందించారు.






