28 May, 2026 | 2:45 AM

స్వయం ఉపాధి రంగాలపై మహిళలు దృష్టి పెట్టాలి

28-05-2026 02:05 AM

కలెక్టర్ గరిమ అగ్రవాల్

గంభీరావుపేట, మే -27 ( విజయక్రాంతి )మహిళా సంఘాల సభ్యులు తమ గ్రామాల్లో నిర్మిస్తున్న నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలని, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, సమాజంలో జరిగే అన్ని అంశాలపై చర్చించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు, గంభీరావుపేట మండలం రాజేశ్వర్ రావు కాలనీలో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజరాజేశ్వర గ్రామైఖ్య సంఘం సభ్యుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. మన జిల్లాలో ఇప్పటివరకు 113 భవనాలు నిర్మించడానికి అనుమతులు మంజూరు చేశామని, ఇప్పటివరకు 103 భవనాలు గ్రౌండింగ్ పూర్తి చేసి వివిధ దశల్లో నిర్మాణ పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో మన జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మొట్టమొదటగా రాజేశ్వర్ రావు కాలనీలో మహిళా శక్తి భవనం పూర్తి స్థాయిలో నిర్మించబడి, అందుబాటులోకి వచ్చిందని అన్నారు. తక్కువ సమయంలోనే భవనాన్ని నిర్మించినందుకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. వివిధ దశల్లో ఉన్న భవనాల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిశెట్టి విజయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, సర్పంచ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.