20-05-2025 12:00:00 AM
ఎండీ వీసీ సజ్జనార్
ఆదిలాబాద్, మే 19 (విజయ క్రాంతి) : మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ సేవలను కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆర్టీసీ డిపో ను ఆయన సందర్శించారు. మొదటిసారిగా డిపోకు వచ్చిన ఎండీకి ఆర్టీసీ సిబ్బంది పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ముందుగా ఆర్టీసీ డిపో ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.
అదేవిధంగా డిపోలోని గ్యారేజ్ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ లో ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి ఆర్టీసీ సంస్థ కీ చైన్లను అందజేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న మహాలక్ష్మి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వం సైతం బకాయిలను వెంటనే విడుదల చేస్తుందన్నారు.
ఆర్టీసీలో అవసరమైన మేరకు కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఎలక్ట్రికల్ బస్సుల సంఖ్యను సైతం పెంచే ఆలోచనలు ఉన్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె త్వరలో కొలిక్కి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ ఆర్.ఎం శ్రీహర్ష, డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, పలువురు ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.