12-11-2025 12:12:04 AM
ఆవేదన చెందుతున్న రైతులు
లక్షేట్టిపేట, నవంబర్ 1౧: ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే అవకాశం లేకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. తాము చస్తేగాని పత్తిని కొనుగోలు చేయరా..? ఇక్కడే మందు డబ్బా తాగి ఆత్మహత్య చేసుకోవాలా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నా తమ దయనీయ పరిస్థితిని పట్టించుకునే వారే లేరని మండిపడుతున్నారు...
వాతావరణ ఆకస్మిక మార్పుల వలన తేమ ఏర్పడితే దానికి అన్నదాతను బలి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు... ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వర్షానికి తడిసిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని, రైతులకు సరైన న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయి లో అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు...
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు...
లక్షెట్టిపేట సమీప కరీంనగర్ చౌరస్తాలోని వెంకటేశ్వర కాటన్ మిల్ నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా రైతులు మిల్లుకు తీసుకువచ్చిన పత్తిని అధిక తేమ పేరుతో తూకం వేయకపోవడం తో, రోడ్డు పొడవునా పత్తి లోడ్ వాహనాలు బారులు తీరాయి. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులకు వ్యాను కిరాయి, వేచి ఉండే సమయం, కూలీని భరించడం తడిసిమోపెడవుతోందని కన్నీటి పర్యంతమవుతున్నారు...
ఒకవైపు కొనుగోలు చేయరు.., మరో వైపు తమ నెంబర్ ఎప్పుడూ వస్తుందో తెలియక రైతన్నలు ఆకలి దప్పులతో మిల్లు వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉండగా తమ కంటే వెనుక వచ్చిన నెంబర్ లకు అధికారులు కాంటా చేస్తున్నారని, దళారుల ప్రమేయంతో ఇలా జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఇలా...
సీసీఐ నిబంధనల ప్రకారం పత్తి తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉంటే రూ. 8110 చొప్పున క్వింటాల్ కు చెల్లించాలి. ఒకవేళ తేమ శాతం 14 నుంచి 16 మధ్యలో ఉంటే అసలు సీసీఐ అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ఒక వైపు వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ లు 12 కంటే తేమ శాతం ఎక్కువ ఉంటే కూడా కొనుగోలు చేయాలని రైతులు చెప్పుకొస్తున్నారు. మంత్రి, కలెక్టర్ మాటలు ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొందరు దళారుల వలన 13 నుంచి 16 శాతం తేమ ఉందని, పత్తిని కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులు బయట ప్రైవేట్ వ్యక్తులకు రూ. 6000 నుంచి రూ. 6500 వరకు తప్పనిసరి పరిస్థితిలో అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు అండగా నిలువాల్సిన సీసీఐ అధికారులు తమను పట్టించుకోవడం లేదని, పైగా ప్రైవేట్ వ్యక్తుల పత్తి కొనుగోలుకు సహకరిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా కొందరు రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు తెచ్చిన పత్తిని వెంటనే తూకం వేసి, సీసీఐ అధికారులు మిగతా రైతులను పడిగాపులు కాసేలా చేస్తున్నారని కొందరు రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. తమకు చదువు రాకపోవడంతో తేమకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయకుండానే సంతకం చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు మీడియాకు తెలిపారు.
ఈ విషయమై మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వర్ను వివరణ కోరగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆ ఒక్క రోజు మాత్రమే తేమ శాతం 12 కంటే ఎక్కువ ఉంటే కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారు. మిగతా రోజులకు అది వర్తించదని చెప్పడం గమనార్హం.
దళారుల రాజ్యం నడుస్తుంది...
ఆరు క్వింటాళ్ల పత్తికి అరగోస పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట తేమ శాతం ఎక్కువ ఉందని, కటింగ్ ల పేరుతో రైతులను నిండా ముంచుతున్నారు. కటింగ్ కు ఒప్పుకోక పోతే తిరిగి పంపిస్తుండ్రు. లేదంటే కటింగ్ కు ఒప్పుకున్నట్లు సంతకం పెట్టుమని బెదిరించారు. అధికారులు వెంటనే స్పందించి రైతుకు నష్టం జరగకుండా కొనుగోలు చేయాలి.
కందుల రామయ్య, లక్ష్మిపూర్ రైతు
ఆరిన పత్తిని కూడా కొంటలేరు...
ఇంటి వద్దనే పత్తిని పూర్తిగా ఆరబెట్టుకొని తీసుకొచ్చిన. అయినా కూడా తేమశాతం ఎక్కువగా వచ్చిందంటూ పత్తిని కొంటలేరు... ఎండిన పత్తిని కూడా తేమ పేరుతో వెనుకకు పంపిస్తుండ్రు. కానీ దళారులు తెచ్చిన పత్తిని మాత్రం ఏం చూడకుండానే కొంటుండ్రు... రైతులు తెచ్చిన పత్తిని తేమ పేరుతో వెనుకకు పంపిస్తుండ్రు. తేమ శాతాన్ని పరిశీలించి ఒకసారి 14 శాతం, మరోసారి 15 శాతమని చెప్పి మీ పత్తి కొనమని వెనక్కి పంపుతూ.., మరోవైపు సంతకం పెట్టమని ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.
తిప్పని సత్తయ్య, లక్ష్మిపూర్ రైతు