30-06-2025 01:37:35 AM
అమరచింతలో విగ్రహావిష్కరణ
వనపర్తి, జూన్ 29 (విజయక్రాంతి): కవి, రచయిత గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిచంద్ 2వ వర్ధంతి సందర్భంగా ఆదివారం అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సాయిచంద్ భార్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయిచంద్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు.
అనంతరం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సాయిచంద్ కవిగా, గాయకుడిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజల మనసులో నిలిచిపోయాడన్నారు. సాయిచంద్ మాట, పాట ఒక తూట అని చెప్పారు. మూడు సార్లు జైలుకు పోయినా, సమైక్యాంధ్ర వాళ్లు ఎన్ని ఆఫర్లు ఇచ్చిన తల వంచలేదని, లాఠీ దెబ్బలకు భయపడని వ్యక్తిత్వం సాయిచంద్ సొంతమని కొనియాడారు.
కేసీఆర్ వెంట ఉండి నిలబడిన అసలైన ఉద్యమకారుడు సాయిచంద్ అని ఆయన గుర్తు చేశారు. ఒక్కనాడైన రేవంత్రెడ్డి జై తెలంగాణ అనలేదని, ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాను అని అంటున్నాని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడమేననే పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జై తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని ఇప్పుడు నై తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని విమర్శించారు.
సాయిచంద్ పాట రూపంలో మన మధ్యలోనే ఉన్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ సమాజానికి తీరని లోటు సాయిచంద్ మరణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సాయిచంద్ లేని లోటు 2023 ఎన్నికల్లో తెలిసిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సాయి మరణించిన రోజులా కాదు జన్మించిన రోజుల ఉన్నదని రజినిసాయిచంద్ అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రాంమోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ నవీన్కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.