calender_icon.png 25 June, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయిరామ్ ఏజెన్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలి

25-06-2025 01:20:26 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యండి.యాకూబ్ పాషా

భద్రాద్రికొత్తగూడెం, జూన్ 24 (విజయ క్రాంతి)జిల్లాలో గల మైనారిటీ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తి కొరకు సాయిరాం ఏజెన్సీ ఇచ్చిన నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యండి యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న సాయిరాం ఏజెన్సీ వారు నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు శాశ్వత కార్యాలయాన్ని నేటి వరకు ఏర్పాటు చేయకుండా గత కొన్నేళ్లుగా పాల్వంచ లో ఏజెన్సీని నిర్వహిస్తూ అధికారులను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

తాజాగా జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల నియామకాల కొరకు ఈనెల 19న ఓ దినపత్రికలో క్లాసిఫైడ్ ప్రకటన విడుదల చేసిందని, ఈ ప్రకటన నందు శాశ్వత చిరునామా లేకపోవటం, గడువు తేది రెండు రోజులు మాత్రమే ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. పత్రికలోని క్లాసిఫైడ్ ప్రకటన చూసిన జిల్లాలోని నిరుద్యోగులు తమ దరఖాస్తులను పూర్తి చేసుకొని క్లాసిఫైడ్ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ కు సంప్రదించగా స్పందన లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందారన్నారు.

మిగతా జిల్లాలలో మాత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కొరకు జిల్లా కలెక్టరేట్ లలోని ఆర్.యల్. సి కార్యాలయాలలో దరఖాస్తులు స్వీకరిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఏజెన్సీ వారు ఉధ్యొగ ప్రకటన విడుదల చేసారన్నారు. దీని కారణంగా అర్హులైన అనేకమంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోలేక నిరాశ చెందారని , ఈ విషయంపై సంబంధిత అధికారులకు పిర్యాదు చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు దృష్టి సారించి సాయిరాం ఏజెన్సీ కాంట్రాక్టు రద్దుచేసి, మరలా నియామక ప్రకటన జారీ చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలని ఆయన కోరారు.