30-05-2025 02:30:06 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.2 లక్షలు అందించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆమోదం తెలుపుతూ, సంబంధిత ఫైల్పై సంతకం చేశారని మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క పేర్కొన్నారు. త్వరలో ఆశావర్కర్ల జీతాల పెంచి, వారిని రెగ్యులైజేషన్ చేస్తామని భరోసానిచ్చారు. భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కొత్తగూడెంలో ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రారంభించారు.
కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించి, ఆడపిల్లలకు శక్తినిచ్చి ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల్లోని 50,269 మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆడపిల్లలు సరైన పౌష్ఠికాహారం లేక అనేక రకాల జబ్బులతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా 14 నుంచి 18 ఏండ్ల లోపు బాలికలకు మిల్లెట్స్తో కూడిన చిక్కీలను నెలకు రెండు ప్యాకెట్లు అందిస్తామని చెప్పారు. ఒక్కో ప్యాకెట్లో 15 చిక్కీలు ఉంటాయని, వీటిని తినడం ద్వారా ఆడపిల్లలు నెలసరి టైమ్లో వచ్చే రక్తహీనత లాంటి అనేక సమస్యలను అధిగమించొచ్చని చెప్పారు. మిషన్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా ప్రభుత్వం నెలకు రూ.4 వేలు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.