కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుముక నీలం
పటాన్ చెరులో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం
పటాన్ చెరు: కార్యకర్తలే పార్టీకి బలమని కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసి, ప్రజలకు మరింత చేరువ చేయడమే సంఘటన్ సృజన్ అభియాన్ ప్రధాన లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు తెలిపారు. బుధవారం పటాన్చెరు నియోజకవర్గంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అశోక్ నగర్ లోని సితార హోటల్ లో పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లాకు సంఘటన్ సృజన్ అభియాన్ పీసీసీ అబ్జర్వర్ శ్రీనివాస్ బాబు పర్యవేక్షణలో ఏఐసీసీ ఇన్చార్జ్గా వచ్చిన దీపక్ రాథోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పదాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, ప్రతి కార్యకర్తకు గౌరవం, ప్రతి నాయకుడికి బాధ్యత, ప్రతి స్థాయిలో సమన్వయం ఉంటేనే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు, ప్రజల సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం ముందుండాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చేయాలని కోరారు.
సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నాయకులు, బ్లాక్, మండల అధ్యక్షులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడం పార్టీ భవిష్యత్ సంస్థాగత నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకత్వం–కార్యకర్తల మధ్య సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘటితమైన కాంగ్రెస్ బలమైన కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్గా పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






