28-10-2025 12:00:00 AM
కరీంనగర్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): దేశ నిర్మాణం దిశగా సర్దార్ 150 యూనిటీ మార్చ్ యువతలో స్ఫూర్తి నింపనున్నదని, ఈ యూనిటీ మార్చ్ లో యువత, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. సోమవారం నగరంలోని మేరా యువభారత్ కార్యాలయంలో ఆయన యూనిటీ మార్చ్ పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయి పటేల్ 150వ జయంతిని స్మరించుకోవడానికి సర్దార్@150 యూనిటీ మార్చ్ ను మే రా యువ భారత్ పోర్టల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని అన్నారు. నిస్వార్థ సేవ, ఏకత, దేశ నిర్మాణం వంటి ఆదర్శ భావనలకు సర్దార్ పటేల్ మార్గదర్శకత్వం వహించారనీ, ఈ భావనలకు ప్రతీకగా జాతీయ స్థాయిలో చేపట్టే కార్యక్రమాల్లో యువత ముందువరుసలో నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేరా యువభారత్, కరీంనగర్ జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఎం వెంకట రాంబాబు, ప్రోగ్రాం అధికారి బి. రవీందర్, పాదయాత్ర కన్వీనర్ శ్రీనివాస్, శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కే తిరుపతి, డి వై ఎస్ ఓ వి శ్రీనివాస్ గౌడ్, యువజన సంఘాల ప్రతినిధులు, తదితరులుపాల్గొన్నారు.