29-05-2025 10:26:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా రాజీవ్ యువ వికాసం పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో రాజీవ్ యువ వికాసం పథకంపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా లబ్ధిదారుల జాబితాపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన యువతను ఎంపిక చేసి, వారిని తగిన శిక్షణా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయాలన్నారు. ప్రతి శాఖ కూడా పరస్పర సమన్వయంతో పని చేసి ఈ పథకం ప్రయోజనాలు అర్హులకూ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున శాఖల వారీగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, జెడ్పి సీఈఓ గోవింద్, సంక్షేమ శాఖల అధికారులు శంకర్, అంబాజీ, శ్రీనివాస్, మోహన్ సింగ్, ఎల్ డి ఎం రాంగోపాల్, తదితరులు పాల్గొన్నారు.