ముదిరాజ్ లను బీసీ ‘డి’ నుండి బీసీ ‘ఏ’ మార్చే అంశం పత్రాలకే పరిమితమా?
మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్
కేసముద్రం,(విజయక్రాంతి): జనాభా సంఖ్యకు తగ్గట్టుగా నిధుల కేటాయింపు లేదని, బీసీ ‘డీ’ కేటగిరి నుండి బీసీ ‘ఏ’ మార్పు అంశం పత్రాలకే పరిమితమైందని, ముదిరాజ్ కులస్తులు సంఘటితంగా తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని మెపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ కేంద్రంలో మెపా ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) కేసముద్రం మండల ప్రధాన కార్యదర్శి కుండే సురేష్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ లే అధికంగా ఉన్నారనీ, అయితే జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముదిరాజ్ లకు రావాల్సిన వాటా ఎటుపోతుందని, ముదిరాజ్ లను బీసీ ‘డి’ నుండి బీసీ ‘ఏ’ కు మారుస్తామని ఇచ్చిన హామినీ ఎటు పోయిందో కూడా ప్రభుత్వం చెప్పాలన్నారు. రానున్న కాలంలో పార్టీలకు అతీతంగా ముదిరాజ్ రిజర్వేషన్ కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.






