26-05-2025 12:04:34 AM
మంచిర్యాల, మే 25 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, కోల్ బెల్ట్ ప్రజలకు సుపరిచితుడైన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ అనారోగ్యంతో కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. జర్నలిస్ట్ మునీర్ మృతి వార్త కార్మికలోకాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ గౌతమ్నగర్లో నివసిస్తున్న ఎండీ మునీర్, పాత్రికేయుడిగా కోల్బెల్ట్ ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో మునీర్ పార్థీవ దేహాన్ని మంచిరాలలోని ఆయన సొంత గృహానికి తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం ఇంటి ఆవరణలో భౌతికకాయాన్ని ఉంచారు.
జర్నలిస్ట్ మునీర్ మృతి వార్త తెలిసిన వెంటనే జిల్లాలోని ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రచయితలు, కవులు మంచిర్యాలకు తరలివచ్చారు. మునీర్ మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబానికి సంతాపం తెలిపారు.
ప్రముఖ రచయిత అల్లం రాజయ్య, సామాజిక కార్యకర్త మహమ్మద్ హుస్సేన్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాదన కుమారస్వామి, ఎమ్మెల్సీ కోదండరాం, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, కోనప్ప, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, కార్మిక నాయకుడు కెంగర్ల మల్లయ్య నివాళులర్పించారు.
మునీర్కు కన్నీటి వీడ్కోలు..
జర్నలిస్ట్ ఎండీ మునీర్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరిగాయి. మందమర్రి సీఆర్ క్లబ్ వెనకాల ఉన్న కబరస్థాన్లో అంత్యక్రియలు జరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన సంతాపసభలో ఎమ్మెల్సీ కోదండరాం, కార్మిక నాయకులు మాట్లాడారు. జర్నలిస్ట్ మునీరు మృతి ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్గా మునీర్ కీలక భూమిక నిర్వహించారని కొనియాడారు.