వరుస దొంగతనాలు.. నిందితుల అరెస్ట్
కాగజ్నగర్, ఫిబ్రవరి26 (విజయక్రాంతి): కాగజ్నగర్ టౌన్ పరిధిలో ఇటీవల జరిగిన వరుసగా దొంగతనాల కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, అపహరించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 5న సిర్సిల్క్ కాలనీకి చెందిన దండే మంగా ఫిర్యాదు చేశారు.
జనవరి 3న ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియ ని వ్యక్తులు రాత్రివేళ ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి 7ట తులాల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి వస్తువులు, మొత్తం సుమారు రూ.2.75 లక్షల విలువైన ఆస్తిని దొంగలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఇర్షాద్ పాషా @ తాజ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా, తన స్నేహితులు షేక్ అంజద్, మిర్జా సోహైల్ బేగ్ లతో కలిసి నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.
నిందితులు ఒక గుంపుగా ఏర్పడి కాగజ్నగర్ పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కేసుతో పాటు టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన మరో ఆరు దొంగతనాల కేసులలో తమ ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.అపహరించిన ఆభరణాలను స్వీకరించిన గోల్డ్స్మిత్ చిలుకూరి శ్రీకాంత్ ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ ప్రజలకు సూచిస్తూ ఇళ్లకు బలమైన తాళాలు అమర్చుకోవాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.




