17 August, 2026 | 12:50 PM

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం ల్యాండింగ్

17-08-2026 11:10 AM

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తొలి షెడ్యూల్డ్ ఫ్లైట్

ప్రయాణికులకు స్వాగతం పలికిన రామ్మోహన్ నాయుడు

విజయనగరం: భోగాపురంలోని(Bhogapuram Airport) అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి ఇండిగో 6E6408 విమానం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు(Union Minister of Civil Aviation Kinjarapu Rammohan Naidu) విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించి, ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను అందజేశారు. దీంతో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

"అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడం ఎంతో సంతోషం, గర్వకారణం. ఇది ఉత్తరాంధ్రకు ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకడమే కాకుండా, ఆ ప్రాంతానికి కొత్త అవకాశాలను కల్పిస్తుంది." అని రామ్ మోహన్ నాయుడు ఎక్స్ ఒక సందేశంలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి మొదటి ఇండిగో విమానం రాగా, ఆ తర్వాత బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం వచ్చింది. కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు అక్కడి మౌలిక సదుపాయాలు, నిర్మాణ శైలి, ఇతర సౌకర్యాలను ప్రశంసించారు.