04-11-2025 01:05:57 AM
ముంబై, నవంబర్ 3: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో రూ.4,462.81 కోట్ల విలువైన 132 ఎకరాల భూమిని తాత్కాలికంగా అటాచ్ చేసింది. బ్యాంకుల మోసం కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్ట నిబంధనల ప్రకారం ఈడీ ఈ చర్యకు పూనుకుంది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లకు సంబంధించిన బ్యాంకు మోసం కేసులపై ఈడీ కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది. గతంలోనే ఈ కేసులకు సంబంధించి రూ.3,083 కోట్లకు పైగా విలువైన 42 ఆస్తులను జప్తు చేసింది. తాజా అటాచ్మెంట్తో జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.7,545 కోట్లకు పైగా చేరింది.
కేసుల నేపథ్యం
2010 -12 మధ్య కాలం నుంచి ఆర్కామ్, దాని గ్రూప్ కంపెనీలు దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు బ్యాంకులకు రూ.40,185 కోట్లు బకాయిపడ్డాయని, ఐదు బ్యాంకులు ఇప్పటికే ఈ రుణ ఖాతాలను మోసపూరితమైనవని ప్రకటించాయని ఈడీ పేర్కొంది.
దర్యాప్తులో ఆర్కామ్ నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు తేలింది. ఒక బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని, మరో బ్యాంకులో ఉన్న ఇతర కంపెనీల రుణాలను తీర్చేందుకు వినియోగించినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.13,600 కోట్లను ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,600 కోట్లను అనుబంధ సంస్థలకు మళ్లించినట్లు కనుగొన్నారు. మరో రూ.1,800 కోట్లను మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత వాటిని తిరిగి గ్రూప్ సంస్థలకే మళ్లించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.