13-12-2024 01:37:37 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ 2.0 పథకంలో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఏడు చెరువుల పరిధిలో రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో 7 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఎస్టీపీ ప్లాంట్ల ఏర్పాట్లపై సమగ్ర నివేదికను ఎమ్మెల్యేకు అందించారు.
కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బీఓటి పద్ధతిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని తిమ్మక్క చెరువు, మేళ్ల చెరువు, ఉసికే బావి, ఇక్రిసాట్, గండిగూడెం, బచ్చు గూడెం, అమీన్ పుర్ పరిధిలోని చెరువుల సమీపంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.11 వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ప్లాంట్ల ఏర్పాటుకు భూ కేటాయింపులు జరపాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారులకు సంబంధిత శాఖ అధికారులు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్లాంట్ల పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 25 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం, 40% సంబందిత కాంట్రాక్టర్ కు బీ ఓ టి పద్ధతిలో నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చెరువులు, కాలువలను మురుగు నీరు, కాలుష్యం బారి నుండి సంరక్షించుకోవడంలో ప్లాంట్ల ఏర్పాటు కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి వెంటనే భూములు కేటాయించాలని తహసీల్దార్ లను ఆదేశించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, జలమండలి డీజీఎంలు బాబు, దీపాలి, శ్రీనివాసరావు, తహసీల్దార్ లు రంగారావు, రాధా, సంగ్రామ్, బిక్షపతి, గంగా భవాని తదితరులు పాల్గొన్నారు.